పార్లమెంట్‌లో గర్జించిన కిషన్ రెడ్డి…!

Date:

⦿  కాంగ్రెస్ టార్గెట్‌గా సంచలన విమర్శలు

⦿ కాంగ్రెస్ వల్లే ఉద్యమంలో 369 బలిదానాలు..

⦿ ఇది నిజం కాదా..?

 

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: లోక్‌సభ వేదికగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన ప్రసంగం తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అమరావతి రాజధాని చట్టబద్ధత బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన పాత గాయాలను గుర్తు చేస్తూ కాంగ్రెస్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు.

⦿ కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి తెలంగాణ బీజేపీ తరపున సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన గత చరిత్రను లోతుగా ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమ పరిణామాలను వివరించిన ఆయన.. కాంగ్రెస్ పార్టీ అనుసరించిన తీరును తీవ్రంగా ఎండగట్టారు. తెలంగాణ ప్రజలు తమ హక్కుల కోసమే కాంగ్రెస్ మెడలు వంచి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

⦿ 1969 నాటి అణచివేతపై విమర్శల జడివాన

1969 నాటి తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేస్తూ నాటి కాంగ్రెస్ పాలనలో జరిగిన అణచివేతను కిషన్ రెడ్డి వివరించారు. ‘జై తెలంగాణ’ అని నినదించిన విద్యార్థులను తుపాకులతో కాల్చి చంపిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందని విమర్శించారు. సుమారు 369 మంది ఉద్యమకారులను కాంగ్రెస్ ప్రభుత్వం బలితీసుకుందని మండిపడ్డారు. మలి దశ ఉద్యమంలో కూడా 1200 మంది యువకులు ఆత్మబలిదానాలు చేసుకోవాల్సి వచ్చిందని.. ఆ వేదనల పునాదులపైనే రాష్ట్రం ఆవిర్భవించిందని పేర్కొన్నారు. కిషన్ రెడ్డి వ్యాఖ్యలతో పార్లమెంటులో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

⦿ ఎయిర్‌పోర్టుల గణాంకాలతో అభివృద్ధిపై పోలిక

తెలంగాణ అభివృద్ధి విషయంలో వెనుకబడి ఉండటానికి గల కారణాలను ఆయన గణాంకాలతో వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఏడు విమానాశ్రయాలు అందుబాటులో ఉన్నాయని.. తెలంగాణలో కేవలం ఒకే ఒక్క విమానాశ్రయం ఉండటం శోచనీయమని పేర్కొన్నారు. ఈ దుస్థితికి గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనతో పాటు సుదీర్ఘ కాలం పాలించిన కాంగ్రెస్ వైఫల్యాలే కారణమని ధ్వజమెత్తారు. విభజన తర్వాత రెండు రాష్ట్రాలు పోటీపడి అభివృద్ధి చెందాల్సింది పోయి.. సమన్వయ లోపంతో సతమతమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ప్రజలు తమ రాజధాని ఏదో చెప్పుకోలేని అయోమయంలో ఉండటం బాధాకరమని వ్యాఖ్యానించారు.

⦿ అమరావతికి బీజేపీ సంపూర్ణ మద్దతు

రెండు తెలుగు రాష్ట్రాలు అన్నదమ్ముల్లా కలిసి మెలిసి అభివృద్ధి పథంలో పయనించాలని కిషన్ రెడ్డి ఆకాంక్షించారు. అమరావతిని రాజధానిగా గుర్తించే చట్టబద్ధత బిల్లుకు తాము పూర్తి స్థాయిలో సహకరిస్తామని స్పష్టం చేశారు. అయితే కాంగ్రెస్ ఎంపీలు ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకించారు. సభలో నిరసన తెలుపుతూ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. చరిత్రను వక్రీకరిస్తూ నిందలు వేయడం సరికాదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

⦿ క్షమాపణ డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ శ్రేణులు

మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ కార్యకర్తలు కిషన్ రెడ్డిపై నిప్పులు చెరుగుతున్నారు. సోనియా గాంధీ దృఢ సంకల్పం వల్లే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని వారు గుర్తు చేస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం అమరవీరుల త్యాగాలను కించపరచవద్దని హితవు పలికారు. కిషన్ రెడ్డి వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రం ఇచ్చిన పార్టీపై బురద చల్లడం బీజేపీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

నారా లోకేష్ ఎక్కడ…?!

గత కొద్ది రోజులుగా కనిపించని యువనేత వైయస్సార్ కాంగ్రెస్...

అందరివాడు రేవంత్…!

కాంగ్రెస్ అగ్రనాయకత్వం నమ్మకం కేంద్ర బిజెపి పెద్దల పాలనా సహకారం...

గులాబీ పార్టీలో కళావిహీనం…!

సందడి లేని ఆవిర్భావ దినం పాతికేళ్ల ప్రస్థానంలో ఎన్నడూ లేని...

అచ్చం తండ్రి మాదిరిగా…?!

ట్రెండీ లుక్ తో విదేశీ పర్యటనకు జగన్మోహన్ రెడ్డి ...